శుశృతుడు

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

శుశృతుడు

నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్‌లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది.

ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు క్రీ.పూ 6వ శతాబ్ధానికి చెందిన శుశృతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృత సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ శుశృత సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళు తెరక ముందే భారతదేశంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.

క్రీ.శ. 800 ప్రాంతాలకు చెందినవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5వేల ఏళ్ళ కంటే పూర్వం వాడే. ఉత్తర భారతదేశంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. శుశృతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు. కాశీ రాజైన ధన్వంతరి శిష్యుడు. శుశృతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ. 9-10 శతాబ్ధాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్య శాస్ర్తం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.

ఆయుర్వేద వైద్య సేవలు

వైద్యశాస్ర్తంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని అర్జించాడు. సుఖ ప్రసవం కొసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్‌లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్ళను తొలగించడంలో నైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.

ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయాలను శస్ర్తచికిత్స ద్వారా అతికించటంలో అందెవేసిన చెయి శుశృతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్ర్తచికిత్సకోసం 120 రకాల వైద్య పరికరాలను శుశృతుడు ఉపయోగించేవాడట!

తెగిన శరీర భాగాలను అతికించటం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు (ఫారిన్ ఆంటీబాడీస్)ను కనుగొని తొలగించటం, పుచ్చిన, దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం(బుడ్డ) రోగికి హాని కులుగకుండా శస్త్రచికిత్స చేసి వేరుచేయడం ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది శుశృతుడే!

ప్రొస్టేట్ గ్రంథిని ఏఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది ? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏమి ? ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను శుశృతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు. మూత్రనాళంలో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో శాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వార విజయవంతంగా తొలగించాడు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.

పోస్ట్‌మార్టం (శవపరీక్ష) వేళ ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త శుశృతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు శుశృతుడు

మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ (మదిర)ను గుర్తించాడు. మానవ జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురి అయ్యే అవకాశాలున్నాయని తీర్మానించాడు.

శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునై పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసే వారికి కొన్ని నియమ నిబంధనలు సూచించారు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయస్సులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.

శుశృత సంహిత

శుశృత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు. ఈ శుశృత సంహితలలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120గా నిరూపించబడినది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు – ఏక వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడినది. 64రకాల ఖనిజాల నుండి మందులను తయారు చేసే వైద్య విజ్ఞానం ఉంది.

ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాలను గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశారు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధిలాగా ఈ గ్రంథం ఉపయోగపడుతున్నది.ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాధులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి.

క్రీ.శ. 8 వ శతాబ్ధంలో సుశ్రుత సంహితను అరబిక్ భాషలోకి కితాబ్ షాషూన్ ఎ హింద్, కితాబ్ ఇ సుస్రుద్ పుస్తకాలుగా అనువదించారు. ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురింటి, శస్త్రచికిత్సలలో వాడే వివిధ శకలాల గురించి ఏకంగా ఒక తంత్రానే రచించారు. దీనినే శల్యతంత్ర అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాధులను దరిచేరనివ్వదని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమురసము (మధ్యం) ద్వారా మత్తు కలిగించి అనస్తీషియా ప్రక్రియకు తొలి రూపం అందించినవారయ్యారు.

ప్రకృతి ఆరాధకుడు

సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు, వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించిఅనేక అమూల్య అంశాలను వెలువరించారు. సంవత్సరంలోని భిన్న భిన్న ఋతువులలో ఆయా వాతావరణాలకు అనుగుణంగా ఉంటూ, వ్యాధిరహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించారు. ఏఏ కాలాల్లో ఏ కూరగాయలు, ఏ పండ్లు తినాలో వివరించారు. తృణధాన్యాలు, పప్పుదినుసులు వాడకం గూర్చి పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.

సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే ప్రకృతిలో అనుసంధానమై విపులంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఏఏ మొక్క మానవునికి ఎన్ని విధాలుగా ఉపయోగపడిందో కూలంకషంగా అధ్యయనం చేశారు. అంతేకాదు తమ గాఢ అధ్యయనం ద్వారా తన శిష్యులకు సరళంగా బోధించేవారు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవారు. శస్ర్తచికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే వైద్యచికిత్సలో వాడే మూలికలను, క్షార పదార్థాలను, లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను ఆయన గాయాల తీవ్రత, స్థాయిలను అనుసరించి తయారు చేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారు. గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతి శీతల వాతావరణం గాని, పూర్తి తడి లేదా పూర్తిగా పొడిగా ఉండడం గాని, ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు.

ఔషధాల తయారీకి ఉపయోగపడు మొక్కలు తులసి నుంచి ఆముదం వరకు, ఔషధోపయోగ గుల్మాలు సీతాఫలం మొదలైన పండ్ల గురించి, వృక్షాలు నేరేడు, మారేడు మొదలైన వాటి గుర్చి తన గ్రంథంలో వివరించటానికి పూర్తి అధ్యాయం కేటాయించాడు. వందలాది మొక్కలు, వృక్షాలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు గూర్చి వాటిని ఉపయోగించుకొనే విధానాలను గూర్చి విశ్లేషణ చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథ రచనలో పొందుపరిచాడు. ఈ గ్రంథం అరబిక్ లోనే కాక లాటిన్ తదితర విదేశీ భాషలలోకి అనువాదమైంది. వ్యాధి గ్రస్తమైన శరీరాన్ని మూడు రకాలుగా విభజించి వ్యాధికి పూర్వం, వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు, వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీరతత్వాన్ని అవగాహన చేసుకోవాలని, ముఖ్యంగా ఆయా రోగులు శరీరతత్వాలను తెలుసుకొని వారి శారీరక, మానసిక బలాలను, ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించారు. గర్భ నిరోధంతో పాటు గర్భధారణకు కూడా అనువైన ఔషధాలను, యవ్వనోత్సాహానికి తగిన మందులను తమ ములికా వైద్యప్రకరణంలో పేర్కొన్నారు. ఈయన సృష్టించిన సందంశయంత్రాలు ఆధునిక శస్త్రవైద్యుల spring forceps, dissection and dressing forceps లకు తొలి రూపాలుగా ఉన్నాయి.

ప్లాస్టిక్ సర్జరీ

ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంత బాగం తీసి తెగిన చోట అమర్చి పూర్వ రూపాన్నికి తీసుకు రావడమే ప్లాస్టిక్ సర్జరీ! ప్లాస్టిక్ సర్జరీలో రైనోప్లాస్టీ (ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం) మీద ప్రఖ్యాతి చెందిన సాధికార గ్రంథం సుశ్రుత సంహిత రాశాడు.

ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతిని సున్నతమైన శరీరభాగాల నుండి చర్మాన్ని వేరుచేసి కొత్త చర్మతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం, పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్ర్తకిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు. సుశ్రుత మహర్షి తన సుశ్రుత సంహిత గ్రంథంలో!

పాశ్చాత్య అల్లోపతీ విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచిపోషించి ఆధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరుపు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి.

క్షార సూత్రం

ఈ క్షార సూత్రం చికిత్స ఫిస్టులా వ్యాధికి ఉద్దేశించారు. ఈ వ్యాధిని భగందరం, లూటీ వ్యాధి, రాచపుండు మొదలగునవి పేర్లతో పిలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్రంలో ఫిస్టులా ఇన్ ఆనో గా పేర్కొంటారు. ఫిస్టులాను క్షారములుగా విభవించారు. క్షార సూత్ర చికిత్స ఫిస్టులా వ్యాధికేకాక అర్స మొలలు (ఫైల్స్), నాడీ వ్రణం మొదలగునవి. వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో విశదీకరించారు. ముందుగా దారమును తీసుకని దానికి 21సార్లు క్షారయుక్తమైన ఔషధాలతో సమ్మిళితం చేస్తారు. దీని క్షార సూత్రమని అంటారు. దీనిని ఉపయోగించి అయిదారు వారాలలో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు. రక్తస్రావం లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు. ముధమేహ రోగులకు, రక్తపోటు ఉన్నవారికి కూడా ఈ క్షార సూత్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.

వైద్య విధానాలు

సుశ్రుతుడు రాసిన గ్రంథ రచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్య చికిత్సా విధానాలు అనేకం తెలియవస్తాయి. శస్త్ర చికిత్సను అతినైపుణ్యంతో నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను, బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు. వైద్యుడి వేషభాషలు ఎలా ఉండాలో ముఖ్యంగా ప్రవర్తన ఏతీరులో ఉండాలో చెప్పారు. మంచి ఆరోగ్యంలో ఉండి పూర్తి చేతనతో, ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు. శస్ర్త పరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని హితవు పలికారు.

సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం అవకాశం ఉన్నా పూర్వకర్మ చికిత్స (ఫిజియో థెరపీ)ను ఆ వ్యక్తికి అందించాలని అప్పుడే శస్త్ర చికిత్సకు సంసిద్ధుడై, చికిత్స అనంతరం త్వరితగతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించారు. మానవులకు హాని కలిగించే వ్యాధులను ఏర్పరచి క్రిమి కీటకాలను పేరొ్కంటూ వాటిని వర్గీకరణ చేశారు. ఏ క్రీమి, కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏ విధమైన మూలికా వైద్య అవసరమో వివరించారు.

మెదడు (పెద్ద మెదడు) లోచిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకరావటానికి కూడా చికిత్సను సూచించారు. కపాలానికి రంధ్రంచేసి మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశారు. శరీరంలో ప్రవహించే రక్తంలో అతి సూక్ష్మక్రిములు పుట్టి ధమనులు సిరలలో జీవిస్తూ పలు రకాల అస్వస్థతలకు గురి చేయగలవని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా మానవుడికి దాపురించే వ్యాధి కారకాలు, చికిత్సా విధానాలను తమ గ్రంథ రచనలో ఇమిడ్చి మానవ జాతికి మహోపకారం చేశారు. ఈ నాటికీ వైద్య విజ్ఞాన కోశంగా ఉపయోగపడుతున్న సుశ్రుతసంహితలోని ముఖ్యాంశాలు దేశదేశాల వారికి మౌలిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సుశ్రుతుడు అంకురార్పణ చేసిన అనేక వైద్యచికిత్సలు ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మనకు పరిచయం కావడంతో ఏమంత విశేషంగా అనిపించకపోవచ్చు. కొన్ని మాత్రం తెరమరుగున వుండి, ఈనాటికీ వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలలో మగ్గుతూ పూర్తి వివరాలకోసం వేచివున్నాయి. ఉదాహరణకు రక్త మోక్షణ

యితర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు

సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక ఆయన పరికరాలలో కొన్ని పురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీ.పూ. 8వ శతాబ్ధానికి చెందిన ఈయన గ్రంథం “అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర” ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికి ఈ గ్రంథం అనువాదం టిబెట్‌లో గుష్టి (నాలుగు వైద్య శాస్ర్త తంత్రములు) పేరుతో లభిస్తున్నవి.

సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు పూర్వకాలంలోనే ఆగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాశ్చత్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్ధిలోనే చరకుని గ్రంథాలు సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాషలోకి తర్హుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుడు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూడా 8వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి.

ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ అత్యవసర వైద్యం చేయడానికి మనక్ అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత మనక్ బాగ్దాద్‌లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్‌తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *