యలవర్తి నాయుడమ్మ 

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ సెంటర్

యలవర్తి నాయుడమ్మ 

  యలవర్తి నాయుడమ్మ (సెప్టెంబర్ 10, 1922 – జూన్ 23, 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.  గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు. అమెరికా లోని లీ హై యూనివర్సిటీ లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం మీద డాక్టరేట్ (పి.హె.డి) డిగ్రీ పొందారు.

                అమెరికా లోని చర్మ పరిశుభ్రం చెసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ(మద్రాసు) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, అమెరికా లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, 1951 లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీ లో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధి లోనూ, గ్రామీణ అభివృద్ధిలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. 1956 లో డైరక్టర్ గా పదోన్నతి పొందారు.

సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని మన దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్టాత్మక హోదాలను అందుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (న్యూఢిల్లీ) సంస్థకు డైరక్టరు జనరల్ (1971-77) గా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) కి వైస్ ఛాన్సలర్ (1981) గా ఉన్నారు. మద్రాసు యూనివర్సిటీకి గౌరవాచార్యులుగా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (మద్రాసు) కు డిస్టింగ్విష్ శాస్త్రవేత్తగా (1977) గా పలు సంస్థలలో వివిధ బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు.

                నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డిహైడ్స్ మొదలైన వాటి కలయిక నిర్మాణ శైలి రంగాలలో కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్ళు పదును చేసే వినూత్న ఏజంట్స్ గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. “జన్మచేత రైతును, వృత్తిచేత అస్పృశ్యుడిని” అని తమ చర్మ శాస్త్ర సాంకేతిక పరిశోధనా వృత్తిని గురించి అప్పుడప్పుడు చమత్కరించేవారు. ఈయన పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మ తయారీ వస్తువులు అనేక వాటికి విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అంతేకాదు విజ్ఞాన వినిమయ కృషిలో అలీన దేశాలకు, ఇతర దేశాలకూ మధ్య రమణీయ సేతువుగా రూపొందారు. ప్రారంభం నుంచి మద్రాసు సి.ఆర్ ఆర్.ఐ లో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. దాని అభివృద్ధికి అహరహం శ్రమించారు. సంస్థ లోని వివిధ ప్రయోగ శాలలకు నూతన రూపు రేఖలు దిద్దారు. నూతన లాబరేటరీలను ప్రణాళికలను వేసి, డిజైన్ రూపకల్పన చేసి, స్థాపించజేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్ లను దేశ స్థాయిలో తొలిసాగిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. లెదర్ సైన్స్ మాసపత్రిక కు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు.       ఈయన 1975 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ , ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థల ఫెలోషిప్ లను అందుకుని పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. దేశ, విదేశ ప్రఖ్యాత సంస్థలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. అమెరికన్ లెదర్ కెమిస్ట్స్ అసోషియేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్, సొసైటీ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్ (బ్రిటన్) మొ.. సంస్థలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్కు, అసోషియేషన్ ఆఫ్ లెదర్ కెమిస్ట్స్ మొదలగు ప్రసిద్ధి చెందిన సంస్థలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇంటటి ఘనతరమైన హోదాలను నిర్వహించినప్పటికీ, సమావేశాలలో ఇతర సభలలో అపరిచితులతో సందర్బవశాత్తు “నా పేరు నాయుడమ్మ అంటారండీ” అని అతి సాధారణంగా తనను తాను పరిచయం చేసుకునేవారు. ఎంతటి వారినైనా ఈయనలోని నిరాడంబరత్వం, నిశిత మేధస్సు, విషవివేచనానుభవం ఇట్టే ఆకట్టుకునేవి.     ఈయన లోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈయనను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈయనను గౌరవ పదవిలో కొనసాగిస్తూ ఈయన పరిణతను, సుదీర్ఘ అనుభవసారాన్ని వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, సైన్స్, టెక్నాలజీలను ఉపయోగించి, వెనుక బాఅటుతనాన్ని (ఆర్ధికంగా) రూపుమాపేందుకు వెనుకబడిన జిల్లాల దత్తత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అనూహ్యంగా సత్ఫలితాలను సధించిన ఈ కార్యశీలి పలు విశిష్ట గౌరవాలు అందుకున్నారు.          “సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం” అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు. ఈ సహాయమును దానంగా పరిగణించనూలేదు. తాను సహకరిస్తున్నట్లుగా అన్యులెవరికీ తెలియకుండా గుప్తంగా అందిస్తూ వచ్చారు. ఇంటటి ఉదార మనస్తత్వం వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నట్లుగా ఆరోపణలు లెకపోలేదు. ఇంగ్లీషు భాషను రమణీయంగా, తెలుగును మరింత తియ్యదనంతో మాట్లాడేవారు. పరిశోధనలు, ఉద్యోగాలకు సంబంధించిన తమ అనుభవాలను సన్నిహితులకు వివరించడంలో కూడ వైజ్ఞానిక సరళిని అనుసరించేవారు. ఈయనతో ఒకసారి సంభాషనలు జరిపినవారు కూడా తమ జీవితంలో ఒక మధుర స్మృతిగా, చిరకాల స్మరణీయ సంఘటనగా మరచిపోలేదు.             ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరు గా (1981-1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థ కు డైరెక్టరు జనరల్ గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందాడు. 1965 లో ఎం.ఎస్. యూనివర్సిటీ(వడోదర) వారు డాక్టర్ కె.జి.నాయక్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. 1971 లో భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారము, రాజలక్ష్మీ సంస్థనుండి శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం పొందాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నాడు.

1985 జూన్ 23 న మాంట్రియల్ లో జరిగిన ఒక సదస్సులో పాల్గొని స్వదేశం తిరిగి వస్తూండగా విమానం పేలిపోయి దుర్మరణం పాలయ్యాడు.           ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ అకాడమీ అధ్వర్యంలో జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థలో 2006, జూన్ 23 వ తేదీన (హైదరాబాద్) ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సదస్సు జరిగింది. అందులో శాస్త్ర రంగంలో విశేష కృషీవలులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ సంచాలకులు డాక్టర్ జి. త్యాగరాజన్ కు నాయుడమ్మ స్మారక బంగారు పతకాన్ని బహూకరించారు. ఈ సందర్భంలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య ప్రసంగిస్తూ ప్రొఫెసర్ నాయుడమ్మ జీవిత విశేషాలు, సాధించిన విజయాలమీద డాక్యుమెంటరీని రూపొందించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరతామని గట్టి హామీని ప్రసాదించారు.        ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి , మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతి ని ఆర్జించి పెట్టారు.   1986 లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *